Legendary cricketer MS Dhoni earns place in ICC Hall of Fame, marking another prestigious milestone in his illustrious career.
భారత మాజీ కెప్టెన్, క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వికెట్ కీపర్-బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన కీర్తి పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ధోనీకి స్థానం లభించడం దేశవ్యాప్తంగా అభిమానులను ఆనందానికి గురి చేసింది. ఈ ఏడాది ఎంపికైన ఏడుగురు దిగ్గజాల్లో ధోనీ ఒకరుగా ఉండటం విశేషం. ఆయనతో పాటు ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా స్టార్ హషీమ్ ఆమ్లా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ధోనీ తన కెరీర్లో చూపిన స్థిరత, ఫిట్నెస్, శాంత స్వభావం, వ్యూహాత్మక చాతుర్యం క్రికెట్ను ఆస్వాదించే ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 538 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి, 17,266 పరుగులు సాధించిన ఆయన, వికెట్ల వెనుక 829 క్యాచులు/స్టంపింగ్లు చేసి అద్భుత రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటనలో ధోనీ ఒక మార్గదర్శకుడిగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఒక లెజెండ్గా ప్రశంసించబడాడు.
ధోనీ నాయకత్వంలో భారత్ మూడు ప్రధాన ఐసీసీ టైటిళ్లు గెలుచుకుంది — 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. ఒత్తిడిలోనూ స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విజయాల బాట పట్టించడం ఆయనలోని గొప్ప నాయకత్వ లక్షణాలను చూపించింది. ముఖ్యంగా 2011 ప్రపంచకప్లో ఫైనల్లో చేసిన మ్యాచ్ విజేత ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది.
ఈ గౌరవంపై స్పందించిన ధోనీ, “ఈ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం నాకు ఎంతో ప్రత్యేకం. ఎంతో మంది గొప్ప క్రికెటర్ల సరసన నా పేరును చూడటం గర్వకారణం. ఇది జీవితాంతం గుర్తుంచుకుంటాను” అని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు 2020లో వీడ్కోలు చెప్పినప్పటికీ, ధోనీ ఇంకా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఈ గుర్తింపు ఆయన లెజెండరీ స్థాయికి అద్దంపడుతుంది.
